gang leader
edited on: Dec 19, 2006 4:45pm
thanks to readers on pointing it.
లాస్ ఏంజెలెస్, జులై 2: “ఈ జన్మకి ఈ ప్రేమ, ఈ ఆత్మీయత, ఈ అభిమానం చాలు!” - వందలాది ‘చిరంజీవుల’ హర్షాతిరేకం మధ్య పద్మభూషణ్ గ్రహీత చిరంజీవి ప్రవాస తెలుగువారికి సవినయంగా సమర్పించిన కృతజ్ఞతా కుసుమాలు.
లాస్ ఏంజెలెస్లో జరుగుతున్న 9వ ఆటా మహాసభల సందర్భంగా విచ్చేసిన చిరంజీవిని చూడడానికి, ఆయన వేదికపై వచ్చిందే తడవుగా పెక్కుమంది పిల్లలు రెట్టించిన ఉత్సాహంతో వేదికపైకి దూసుకుపోయారు. చేతికి అందిన కాగితాలు, పుస్తకాలు పట్టుకుని ఆటోగ్రాఫ్లు అడిగారు. తనపై అంత అభిమానాన్ని ప్రదర్శించిన చిన్న పిల్లలందరికి చిరంజీవి నవ్వుతూ కరచాలనం కోసం చేతులందించారు.
సరిగ్గా ఊహ కూడా రాని ఆ పసి హృదయాల్లో తనకు లభించిన సుస్థిర స్థానానికి స్వయంగా చిరంజీవే ఆశ్చర్యచకితులయ్యారు. ప్రవాస తెలుగు పిల్లల్లో ఇంత చిన్నవారిలో కూడా తనపట్ల అంత అభిమానాన్ని చూడడం ఇదే మొదటిసారని ఆయన ఆనందపారవశ్యంతో చెప్పారు. అమెరికాలోని తెలుగువారు తమ సంస్కృతి కోసం ఆరాటపడుతూ, తెలుగు సినిమాల ద్వారా పిల్లల్లో తెలుగు పట్ల మమకారం పెంచేట్లు చేసిన ఘనత వారి తల్లిదండ్రులదేనని ఆయన ప్రశంసించారు.
రాష్ట్రపతి చేతులమీదుగా చిరంజీవి పద్మభూషణ్ గౌరవాన్ని అందుకున్న అనంతరం జరుగుతున్న ప్రవాస తెలుగువారి ఈ తొలి మహాసభల్లో సత్కరించడానికి ఆటా ఆయన్ను ఆహ్వానించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి తనను, తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఎంతగానో అభిమానిస్తున్న ప్రవాసులందరికి వినమ్రంగా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రేక్షకుల అభిమానాన్ని ఎప్పుడూ పుచ్చుకోవడమే కాదని ఇచ్చుకోవడం కూడా అవసరమని ఈ సందర్భాన్ని ప్రేక్షకుల పట్ల తన అభిమానాన్ని చాటుకోవడంగా ఆయన అభివర్ణించారు. అంతటితో సభికులు పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో తమ ఆనందోత్సాహాలను చాటుకున్నారు.
తనలో ఉరకలెత్తే ఈ ఉత్సాహానికి ప్రేక్షకుల చెక్కుచెదరని ఆదరాభిమానాలతో పాటు ఈ చప్పట్లే కారణం అని ఆయన చెప్పడంతో సభికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
“ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే బిల్గేట్స్ అని మీరంతా అంటారు. కాని బిల్గేట్స్ కంటే మరింత సంపన్నుడిని నేనే. ఎందుకంటే మీ అభిమానాన్ని డాలర్లలో మారిస్తే మిలియన్లు, బిలియన్లు కాదు, ట్రిలియన్లు అవుతాయి” అని చిరంజీవి చెప్పారు. అందుకే ఎన్ని షూటింగ్ వత్తిడులు ఉన్నా, పదిహేను నిమిషాల కోసం ఇన్ని వేల మైళ్ళ ప్రయాణం వద్దని తనవారు వారించినా ఈ ప్రవాసాంధ్రులకు తెలుగు పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు చెప్పడానికి తాను వచ్చానని ఆయన వివరించారు.
సమయం మించిపోతున్న దృష్ట్యా ఇక ముగిస్తానని చిరంజీవి వీడ్కోలు తెలుపబోతుండగా ఒక చిన్నారి మీకోసం ఏడు గంటలపాటు ఎదురు చూశానని అనడంతో చిరంజీవి నవ్వుతూ “మీ అందరిని చూడడానికి నేను కొన్నివేల మైళ్ళు ప్రయాణించి వచ్చాను” అని నవ్వుతూ బదులిచ్చారు. అంతటితో సభలో నవ్వులు వెల్లివిరియగా చిరు ‘తెరమరుగయ్యారు’.
—
ఆంధ్రజ్యోతి జులై 4, 2006 సంచిక నుంచి సంగ్రహితం. కేవలం ఆ పేజీకి లింక్ ఇస్తే సరిపోయేది కాని.. ఆ పేజి బహూశా రేపు ఉండకపోవచ్చేమో అని నేను ఇక్కడ మళ్ళీ పెడుతున్నాను.
వర్డ్ ప్రెస్ . కాం చేత శక్తివంతము చేయబడినది